కరకగూడెం,ఆధాబ్ న్యూస్ ఏప్రిల్ 5: వర్షాకాలం సమీపిస్తున్న వేళ చిరుమల్ల బ్రిడ్జి పటిష్టతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సిపిఎం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో రెండు నెలల్లో వర్షాకాలం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నా ఇప్పటివరకు బ్రిడ్జి పనులు ప్రారంభించలేదని, వెంటనే పనులు చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కోతకు గురైన చిరుమల్ల బ్రిడ్జిని పార్టీ నాయకులు సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకన్న, గత వర్షాకాలంలోనే వరదలతో మట్టి కొట్టుకుపోయి బ్రిడ్జి దెబ్బతిందని, కానీ ప్రభుత్వం అప్పట్లో తాత్కాలికంగా ఇసుక బస్తాలు పెట్టి సమస్యను నివారించేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. ఇకనైనా ముందస్తుగా చర్యలు తీసుకుని బ్రిడ్జి పటిష్టత కోసం కరకట్టలు నిర్మించాలని, పటిష్ట నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
మండలంలోని బంగారు గూడెం సమీపంలోని బ్రిడ్జి, సమత్ బట్టుపల్లి పంచాయితీ పరిధిలోని బూడిద వాగు బ్రిడ్జిలు కూడా వరుస వర్షాల్లో దెబ్బతిన్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు ప్రజలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బ్రిడ్జి పనులు ప్రారంభించకపోతే ఆయా గ్రామాల ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ కొమరం కాంతారావు, మండల కమిటీ సభ్యులు సర్ప సత్యం, కొమరం మల్లక్క, పదం బాబురావు, నరసింహారావు, పద్దం గణేష్, లక్ష్మయ్య, ఉంగయ్య, సతీష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.









