కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం మోతే గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు దారుణానికి దారితీశాయి. నైనరాపు సాగర్ (30) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కరకగూడెం ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 9వ తేదీన సాగర్ ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. ఆవేశంలో ఆయన పురుగుల మందు తాగాడు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను కరకగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కొన్నిరోజుల పాటు చికిత్స పొందిన అనంతరం ఆయనను ఇంటికి తీసుకువచ్చారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం సాగర్ మృతి చెందాడు.
ఈ ఘటనపై సాగర్ భార్య నాగేంద్ర ఫిర్యాదు మేరకు కరకగూడెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాజేందర్ కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.









