7 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామకం
ఆధాబ్ న్యూస్,మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు మరో ముందడుగు వేసింది. పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల ప్రత్యేక చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రిలో 7 మంది నూతన స్పెషలిస్ట్ వైద్యులను నియమించారు.
ఇప్పటివరకు ఉన్న 6 మంది వైద్యులతో పాటు తాజా నియామకాలతో మొత్తం 13 మంది వైద్యులు ప్రజలకు అందుబాటులోకి రానున్నారు. ఈ మేరకు గైనకాలజిస్ట్, అనస్థీషియాలజిస్ట్, పిల్లల వైద్యుడు, జనరల్ ఫిజీషియన్, స్కానింగ్ వైద్యులు నియమితులయ్యారు.
నూతనంగా నియమితులైన వైద్యులు:
గైనకాలజిస్ట్: 2
అనస్థీషియాలజిస్ట్: 2
పిల్లల వైద్యుడు: 1
జనరల్ ఫిజీషియన్: 1
రేడియోలజిస్ట్: 1
గతంలో అందుబాటులో ఉన్న వైద్యులు:
MBBS వైద్యులు: 5
డెంటల్ వైద్యుడు (BDS): 1
మొత్తం వైద్యులు: 13
ఈ కొత్త నియామకంతో మణుగూరు ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు మరింత చేరువ కానున్నాయి. ప్రసూతి సేవలు, అత్యవసర చికిత్సలు, శస్త్రచికిత్సల సమయంలో అనస్థీషియా సేవలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ, జనరల్ మెడిసిన్ మరియు స్కానింగ్ సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక ప్రజలకు గొప్ప ఉపశమనం కలిగించనుంది. అవసరమైన ఆరోగ్యసేవలను అందించేందుకు ప్రభుత్వం దశల వారీగా చర్యలు చేపడుతుండటం అభినందనీయమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









