కాంగ్రెస్ నాయకులు హద్దు దాటి మాట్లాడితే తాటతీస్తాం
కరకగూడెం, ఆగస్టు 25 (ఆధాబ్ న్యూస్): మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును విమర్శిస్తూ కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేగా కాంతారావుపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకుని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మంగళవారం కరకగూడెం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. రేగా కాంతారావుకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదని, ప్రజలే రాజకీయంగా ఆదరించి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. ప్రజల తీర్పును ఏ పార్టీ నాయకుడూ తన ఖాతాలో వేసుకోవద్దని సూచించారు.
రేగా కాంతారావును విమర్శించే ముందు కాంగ్రెస్ నాయకులు తమ ప్రభుత్వ పనితీరును ఒక్కసారి పరిశీలించుకోవాలని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో, నియోజకవర్గానికి ఎన్ని కొత్త అభివృద్ధి పనులు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడమే కాంగ్రెస్ నాయకుల పనిగా మారిందని విమర్శించారు.
రేగా కాంతారావుపై నమోదైన కేసు అంశాన్ని రాజకీయంగా ప్రస్తావించడంపై బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తూ.. సంబంధిత న్యాయస్థానం ఆ కేసును కొట్టివేసిందని పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో ముగిసిన అంశాన్ని పదేపదే రాజకీయ విమర్శలకు ఉపయోగించడం సరికాదని, న్యాయస్థాన తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు.
రేగా కాంతారావు ఆస్తులపై ప్రశ్నించే ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల ఆస్తుల వివరాలను కూడా ప్రజల ముందు ఉంచాలని సవాల్ చేశారు. అప్పుడు ఎవరు ఎవరిని ప్రశ్నించాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు నియోజకవర్గ ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. ప్రజల బలం ఎవరిదో తెలుసుకోవాలంటే బహిరంగంగా ప్రజల్లోకి రావాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రశ్నించడం ప్రతిపక్షాల హక్కు అని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమైతే తాము కూడా సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తే మరింత గట్టిగా ప్రజల మధ్యకు వెళ్తామని అన్నారు.
వ్యక్తిగత దూషణలు, బెదిరింపు వ్యాఖ్యలతో రాజకీయాలు నడవవని, ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. రేగా కాంతారావుపై హద్దు దాటి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై వంద ప్రశ్నలు అడిగేందుకు సిద్ధంగా ఉన్నామని, కోర్టు కొట్టివేసిన కేసును మళ్లీ రాజకీయ ప్రచారానికి ఉపయోగించకుండా ప్రజా సమస్యలపై చర్చకు రావాలని సవాల్ చేశారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, సర్పంచులు కొమరం సత్యనారాయణ, వట్ట సందీప్, మండల నాయకులు పోగు వెంకటేశ్వర్లు, బైరిశెట్టి చిరంజీవి, రేగా సత్యనారాయణ, అత్తె సత్యనారాయణ, నిట్టా ఏడుకొండలు, యల్లు రామకృష్ణారెడ్డి, కటకం లెనిల్, జాడి నాగరాజు, కొమరం విశ్వనాథం, పాయం క్రిష్ణ, పాయం నర్సింహారావు, గాందర్ల సతీష్, ప్రశాంత్, రాంబాబు, శ్రీను, యాకూబ్ పాషా, వేణు తదితరులు పాల్గొన్నారు.








