గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు?
రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు
ఆధాబ్ న్యూస్, కొండమల్లేపల్లి:
కొన్ని వార్తలు చదివి మరిచిపోతాం.. మరికొన్ని ఘటనలు మాత్రం మనసులో ప్రశ్నలుగా మిగిలిపోతాయి. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య ఘటన కూడా అలాంటిదే. పుస్తకాలు పట్టాల్సిన పదో తరగతి విద్యార్థుల చేతుల్లో కత్తులు ఎలా వచ్చాయి? గురువుగా విద్యాబుద్ధులు చెప్పిన వ్యక్తిపైనే హత్యకు పాల్పడేంత కసి ఎందుకు పెరిగింది? అనే ప్రశ్నలు సమాజాన్ని కలచివేస్తున్నాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రూపారెడ్డి హత్య కేసులో ఆమె వద్ద చదువుకున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులే నిందితులుగా ఉన్నారు. కేసు దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సుమారు 70 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
హత్య అనంతరం పాఠశాలకు నాలుగు రోజులు సెలవులు ప్రకటించగా, తిరిగి పాఠశాల ప్రారంభమైన తర్వాత గైర్హాజరైన 13 మంది విద్యార్థులను పోలీసులు విచారించారు. వారిలో ఐదుగురు పదో తరగతి విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఇద్దరు ఇటీవల అధికంగా డబ్బు ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నట్లు గుర్తించి విచారించినట్లు పోలీసులు తెలిపారు.
రూ.1.54 లక్షల నగదుతో కీలక ఆధారం
విచారణలో ఒక నిందితుడి వద్ద రూ.1.54 లక్షల నగదును పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించగా తల్లిదండ్రులు ఇచ్చారని చెప్పినట్లు వెల్లడించారు. అయితే నగదు నోట్లపై రక్తపు మరకలు కనిపించడంతో ఫోరెన్సిక్ పరీక్షలకు పంపగా.. ఆ రక్తం రూపారెడ్డికి చెందినదేనని నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు.
హాస్టల్ నుంచి డే స్కాలర్గా మార్చడంపై కోపం?
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుల్లో ఒకరు గతంలో హాస్టల్లో ఉండేవాడు. అతడికి మద్యం అలవాటు, బైకులపై మోజు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. అతడి బ్యాగులో నగదు, ఫోన్ను రూపారెడ్డి గుర్తించి మందలించడంతో పాటు హాస్టల్ నుంచి డే స్కాలర్గా మార్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత ఆమెపై విద్యార్థికి కోపం పెరిగినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ముందుగానే రెక్కీ.. మాస్కులతో ఇంట్లోకి ప్రవేశం
పోలీసుల ప్రకారం.. నిందితుల్లో ఒకరు నెల రోజుల క్రితం గోవాకు వెళ్లాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో రూపారెడ్డి ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. హత్యకు ఐదు రోజుల ముందే ఆమె ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు వెల్లడించారు.
ఈ నెల 11న పాఠశాల ముగించుకుని రూపారెడ్డి ఇంటికి వచ్చిన అనంతరం ఇద్దరు నిందితులు మాస్కులు ధరించి ఆమె ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. గోడ దూకే సమయంలో ఒకరి మాస్క్ కిందపడటంతో రూపారెడ్డి అతడిని గుర్తించినట్లు, దీంతో తమను గుర్తించిందనే భయంతో ఆమెపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అనంతరం ఆమె వద్ద ఉన్న ఫోన్, నగదును తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు.
నిందితుల నుంచి రూ.1.54 లక్షల నగదు, ఒక ఐఫోన్, రూపారెడ్డికి చెందిన ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులు మైనర్లు కావడంతో వారిని జువెనైల్ జస్టిస్ కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.
అసలు ప్రశ్న ఇదే..
ఈ ఘటనకు సంబంధించిన నేరపరమైన అంశాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజానిజాలు న్యాయ ప్రక్రియలో తేలాల్సి ఉంది. అయితే ఈ ఘటన మన ముందు మరో పెద్ద ప్రశ్నను ఉంచుతోంది.
పదో తరగతి వయసులోనే ఒక విద్యార్థి ఆలోచనలు ఇంతటి నేరం వైపు ఎందుకు మళ్లాయి?
పదో తరగతి అనేది విద్యార్థి జీవితంలో కీలకమైన దశ. ఈ వయసులో భవిష్యత్తు గురించి కలలు కనాలి. డాక్టర్, ఇంజనీర్, పోలీస్, సైనికుడు కావాలని ఆశించాలి. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకోవాలి. కానీ డబ్బు కోసం నేరం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఒక్కరోజులో పుట్టిన ఆలోచనా? లేక చాలా కాలంగా పెరుగుతున్న ఆలోచనలకు ఇది చివరి రూపమా? అనే ప్రశ్నలు ఆలోచింపజేస్తున్నాయి.
డబ్బుపై ఆకర్షణ, జల్సాలపై ఆసక్తి, చెడు స్నేహాలు, మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావం, కోపం, ఆవేశం.. ఇవన్నీ ఒక బాలుడి ఆలోచనలను ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయో సమాజం పరిశీలించాల్సిన అవసరం ఉంది.
పిల్లల మార్కులు తెలుసు.. మనసులు తెలుసా?
పిల్లల మార్కులు తగ్గితే తల్లిదండ్రులు వెంటనే గమనిస్తారు. ర్యాంకు తగ్గితే ఆందోళన చెందుతారు. చదువులో వెనుకబడితే పాఠశాలతో మాట్లాడతారు.
కానీ వారి ప్రవర్తనలో మార్పులను గమనిస్తున్నామా?
వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? తరచూ డబ్బు ఎందుకు అడుగుతున్నారు? ఫోన్లో ఏం చూస్తున్నారు? వారి మాటల్లో కోపం, అసహనం పెరుగుతోందా? చెడు అలవాట్ల వైపు ఆకర్షితులవుతున్నారా? అనే ప్రశ్నలు కూడా తల్లిదండ్రులు వేసుకోవాల్సిన సమయం వచ్చింది.
పిల్లలకు ఖరీదైన విద్య అందిస్తున్నాం. మంచి పాఠశాలలు, మంచి కాలేజీలు, మంచి ఉద్యోగాలు కోరుకుంటున్నాం. కానీ మంచి మనిషిగా ఎలా జీవించాలో కూడా నేర్పుతున్నామా? గెలవడం ఎలా అనేది చెబుతున్నాం.. ఓడిపోయినప్పుడు ఎలా నిలబడాలో నేర్పుతున్నామా? స్వేచ్ఛ ఇస్తున్నాం.. బాధ్యతను కూడా నేర్పుతున్నామా? అనే విషయాలను ప్రతి కుటుంబం ఆలోచించాలి.
పాఠశాల బాధ్యత కూడా కీలకమే
పాఠశాల అంటే కేవలం పాఠ్యపుస్తకాలు, పరీక్షలు, మార్కులు మాత్రమే కాదు. విద్యార్థి వ్యక్తిత్వాన్ని నిర్మించే స్థలం కూడా.
విద్యార్థి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు వస్తే, కొత్త స్నేహాలు ఏర్పడితే, అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తే, కోపం–అసహనం పెరిగితే.. పాఠశాల యాజమాన్యం కూడా వాటిని సీరియస్గా తీసుకోవాలి. అవసరమైన చోట కౌన్సెలింగ్ అందించాలి.
ఒక విద్యార్థి పరీక్షలో ఫెయిల్ కాకుండా కాపాడటం ఎంత ముఖ్యమో.. అతడు జీవితంలో తప్పుదారి పట్టకుండా కాపాడటం అంతకంటే ముఖ్యమైన బాధ్యత.
ఘటనను క్రైమ్ వార్తగా మాత్రమే చూడొద్దు
రూపారెడ్డి మరణం ఒక కుటుంబానికి తీరని విషాదం. ఇద్దరు మైనర్లపై హత్య ఆరోపణలు వారి కుటుంబాలకు కూడా తీవ్ర విషాదమే. ఈ ఘటనను కేవలం ఒక క్రైమ్ వార్తగా చదివి మరిచిపోతే.. మనం ఇందులోని అసలు పాఠాన్ని కోల్పోయినట్లే.
పిల్లలు నేరం చేసిన తర్వాత వారిని నిందించడం సులువు. కానీ వారు నేరం చేసే స్థితికి చేరుకునే ముందే వారి చేతిని పట్టుకోవడం కుటుంబం, పాఠశాల, సమాజం బాధ్యత.
మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం మాత్రమే కాదు.. ఆ భవిష్యత్తును మంచి మనుషులుగా తీర్చిదిద్దడం కూడా మనందరి బాధ్యత.
– ఆధాబ్ న్యూస్








