కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు యథావిధిగా కొనసాగించాలి
కరకగూడెం ,ఆధాబ్ న్యూస్: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కరకగూడెం మండల కేంద్రంలో నిరసన, రాస్తారోకో నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పెండింగ్లో ఉన్న చెక్కులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేసిందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తులం బంగారంతో పాటు ఈ పథకాలను కొనసాగించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాటిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించడంతో పాటు పెండింగ్లో ఉన్న చెక్కులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల సంక్షేమానికి సంబంధించిన పథకాలను నిలిపివేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు కొమరం విజయ, పాయం కృష్ణవేణి, పోలెబోయిన రాణి, వట్టం సందీప్తో పాటు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








