వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం
చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన
పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి:
అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ : కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా కరకగూడెం పోలీసులు వలస ఆదివాసీ గుత్తి గ్రామమైన అంగారిగూడెంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఏడూళ్ల బయ్యారం సీఐ వి. వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్. రావు సిబ్బందితో కలిసి గ్రామంలోని చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీఐ వి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించి, చదువుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. విద్య ద్వారా పిల్లలకు మెరుగైన భవిష్యత్తు లభిస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం తరఫున అందే సహాయ సహకారాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన సహాయం అందించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఆదివాసీ కుటుంబాలు కూడా సమాజంతో పాటు అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు.
అసాంఘిక కార్యకలాపాలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించవద్దని, చట్టవ్యతిరేక చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.








