పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారులకు మరో షాక్
న్యూఢిల్లీ, మే 19 (ఆధాబ్ న్యూస్):
దేశవ్యాప్తంగా వాహనదారులకు మరోసారి ఇంధన ధరల భారం పడింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఒకే వారంలో రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. గత మే 15న లీటరుకు రూ.3 చొప్పున పెంచిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, తాజాగా మంగళవారం మరో 90 పైసల మేర ధరలను పెంచాయి.
దీంతో కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే లీటర్ ఇంధనంపై దాదాపు రూ.3.90 వరకు అదనపు భారం పడింది. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా పెంపు తర్వాత ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.110.85కు చేరగా, డీజిల్ ధర రూ.98.96గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ రూ.98.64, డీజిల్ రూ.91.58గా నమోదైంది. ముంబైలో పెట్రోల్ రూ.107.59, డీజిల్ రూ.94.08గా ఉండగా, కోల్కతాలో పెట్రోల్ రూ.109.70, డీజిల్ రూ.96.07గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.104.49, డీజిల్ రూ.96.11గా నమోదైంది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువలో మార్పులు వంటి కారణాలతో ఇంధన ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగే అవకాశముండటంతో, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే స్థానిక పన్నులు (VAT) ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని అధికారులు తెలిపారు.









