ఫామ్ ఆయిల్ తోటకు నిప్పు.. రైతుకు భారీ నష్టం
ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వెంకటనారాయణ విజ్ఞప్తి
కరకగూడెం, మే 16 ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తాటి గూడెం గ్రామానికి చెందిన రైతు పోలేబోయిన వెంకటనారాయణ సాగు చేస్తున్న ఫామ్ ఆయిల్ తోటకు అకస్మాత్తుగా నిప్పు అంటుకొని మొక్కలు కాలిపోయాయి.
వివరాల్లోకి వెళ్తే.. రైతు వెంకటనారాయణ గత సంవత్సరం సుమారు 3 ఎకరాల్లో రూ.1 లక్ష వ్యయంతో పామ్ ఆయిల్ మొక్కలను నాటాడు. ఎంతో ఆశతో సాగు చేస్తున్న ఈ పంట ప్రస్తుతం మంచి దశలో ఎదుగుతున్న సమయంలో గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో తోటలోని మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి.
ఈ అగ్నిప్రమాదంతో రైతుకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. పంట కాలిపోవడంతో రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. కాలిపోయిన తోటను చూసి కన్నీటి పర్యంతమైన రైతు వెంకటనారాయణ, తనను ప్రభుత్వం వెంటనే ఆదుకొని నష్టపరిహారం అందించాలని వేడుకున్నాడు.
స్థానిక రైతులు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, ప్రకృతి వైపరీత్యాలు మరియు ప్రమాదాలతో నష్టపోతున్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నారు.









