ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు
మణుగూరు, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మణుగూరు కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ ఆదేశాల మేరకు డాక్టర్ రామదాసు ఆధ్వర్యంలో అమూల్య డయాగ్నస్టిక్ సెంటర్లు, ప్రమోద్ డెంటల్ ఆసుపత్రి, సుశ్రుత హాస్పిటల్, నాగార్జున డెంటల్, సింగరేణి ఏరియా ఆసుపత్రులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సంబంధిత ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ల అనుమతులు, రికార్డులు, వైద్య సేవల నిర్వహణపై పరిశీలన చేపట్టారు. అనుమతులు లేకుండా ఆసుపత్రులు లేదా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని నిర్వాహకులకు హెచ్చరించారు. తనిఖీలకు సంబంధించిన నివేదికను జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారికి సమర్పించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ హరీష్, డిప్యూటీ డెమో నాగలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ బేబీ, జూనియర్ అసిస్టెంట్లు శ్రీధర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.









