ఏసీబీ వలలో అటవీ శాఖ పెద్ద తలలు
రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ భద్రాచలం ఎఫ్డీఓ, డీఆర్వో
ఆధాబ్ న్యూస్, భద్రాచలం, మే 7:
భద్రాచలం అటవీ శాఖలో అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చింది. రూ.3.5 లక్షల లంచం తీసుకుంటూ భద్రాచలం అటవీ శాఖ ఎఫ్డీఓ సుజాత, చర్ల ఇన్చార్జ్ డీఆర్వో కృష్ణయ్యలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.
చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో పొరపాటున కొన్ని చెట్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఎఫ్డీఓ సుజాత బాధితుల వద్ద రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా గురువారం భద్రాచలం కార్యాలయంలో రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనతో అటవీ శాఖలో కొనసాగుతున్న అవినీతి వ్యవహారాలు మరోసారి బయటపడ్డాయి. గతంలో కూడా కొత్తగూడెం అటవీ అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి మూడున్నర లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటన సంచలనం సృష్టించింది. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు అటవీ శాఖలో అవినీతి ఏ స్థాయిలో పెరిగిందో చూపిస్తున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు.









