ఆర్టీసీ బస్సులో టికెట్ వివాదం… రూ.20 వేల లంచం డిమాండ్ ఆరోపణలతో చెకింగ్ అధికారిపై దాడి
సంగారెడ్డి,ఆధాబ్ న్యూస్:
హైదరాబాద్ నుండి నారాయణఖేడ్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో జరిగిన సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద టికెట్ స్క్వాడ్ తనిఖీ కోసం బస్సును ఆపింది.
తనిఖీ సందర్భంగా ఒక ప్రయాణికుడి వద్ద టికెట్ లేకపోవడం గమనించిన చెకింగ్ అధికారి, కేసు నమోదు చేయకుండా ఉండాలంటే ప్రయాణికుడితో పాటు కండక్టర్ నుండి రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కండక్టర్ మరియు కొంతమంది ప్రయాణికులు చెకింగ్ అధికారితో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కండక్టర్ చెకింగ్ అధికారిని చెప్పుతో కొట్టినట్లు సమాచారం. కొందరు ప్రయాణికులు కూడా అధికారిపై దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.
సంఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో ఆర్టీసీ వ్యవస్థలో తనిఖీల సమయంలో జరుగుతున్న అవినీతి ఆరోపణలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.








