ఘనంగా 141వ మేడే వేడుకలు
పినపాక,ఆధాబ్ న్యూస్:
పినపాక మండలంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) కార్యాలయం ముందు మండల కార్యదర్శి తోగటి కుమార్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్మికులు ఐక్యత నినాదాలతో ఉత్సాహంగా పాల్గొని స్వీట్లు పంచుకున్నారు.
ఈ సందర్భంగా తోగటి కుమార్ మాట్లాడుతూ, కార్మికులు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రద్దు చేయడం కార్మికుల పట్ల తీరని ద్రోహమని విమర్శించారు. మేడే స్ఫూర్తితో కార్మికులు ఐక్యంగా పోరాటాలు కొనసాగించి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
అలాగే బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పే విధంగా ఉద్యమాలు చేపట్టాలని, కార్మిక హక్కుల పునరుద్ధరణ కోసం సమష్టిగా ముందుకు రావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు పత్తిపాటి నాగేశ్వరరావు, గడ్డం మనోహర్ చారి, పసుపులేటి విజయలక్ష్మి, చెన్నయ్య, సర్వేష్, పోలబోయిన సాంబయ్య, పద్మనాభ రాజు, సహాయ కార్యదర్శులు కారం రమేష్, కప్ప వెంకటేశ్వర్లు, జిల్లా టిడిపి నాయకులు ధర్మరాజు శంకర్, ఆటో యూనియన్ సభ్యులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.








