పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు: ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 28 (ఆధాబ్ న్యూస్): జిల్లాలో పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. కొందరు అధిక ధరలకు విక్రయించాలనే ఉద్దేశంతో కృత్రిమ కొరతను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇటువంటి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
జిల్లా ప్రజలు ఇంధన కొరతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఎక్కడైనా పెట్రోల్ బంకుల్లో గానీ, ఇతర ప్రదేశాల్లో గానీ ఇంధనం ఉన్నప్పటికీ లేదని చెప్పడం లేదా అధిక ధరలకు విక్రయించడం వంటి ఘటనలు గమనించినట్లయితే వెంటనే స్థానిక పౌర సరఫరాల అధికారులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక వదంతులను నమ్మి ఇండ్లలో పెట్రోల్, డీజిల్ నిల్వలు చేసుకోవద్దని, అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని ప్రజలను కోరారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.








