26 ఏళ్ల తర్వాత స్నేహబంధం సజీవం – బాల్యమిత్రుడి కోసం 160 కి.మీ. ప్రయాణం
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్ : స్వార్థం లేని స్నేహం ఎంత గొప్పదో మరోసారి నిరూపించిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. 26 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న బాల్యమిత్రుడు కోసం సుదూర ప్రయాణం చేసి సహాయం చేసిన సంఘటన అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.
1995 నుండి 2000 సంవత్సరాల మధ్య కాలంలో పాల్వంచ గురుకుల పాఠశాలలో కలిసి చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ జిల్లాలలో నివసిస్తున్నారు. ఈ మిత్రుల్లో జిమ్మిడి శ్రీను అనారోగ్య కారణాల వల్ల వికలాంగుడిగా మారాడు. ఇటీవల ప్రభుత్వం అతనికి ట్రైసైకిల్ అందజేసింది.
శ్రీను స్వస్థలం కరకగూడెం మండలం తాటిగూడెం గాంధీనగర్ గుంపు. గత నెలలో కొత్తగూడెంలో ట్రైసైకిల్ పొందిన అనంతరం ఇంటికి బయలుదేరిన సమయంలో పాల్వంచ వద్ద ట్రైసైకిల్ పంచర్ అయింది. అక్కడ పరిచయస్తుల ఇంటి వద్ద వాహనాన్ని ఉంచి, బస్సులో ఇంటికి వెళ్లిపోయాడు.
ఈ పరిస్థితిలో తన బాల్యమిత్రులకు సమాచారం అందించగా, వారి సహకారంతో సత్తుపల్లి నివాసి గొల్లమందల కృష్ణ ముందుకు వచ్చాడు. సత్తుపల్లి నుంచి 76 కిలోమీటర్లు ప్రయాణించి పాల్వంచకు చేరుకున్న కృష్ణ, ట్రైసైకిల్ను తీసుకుని పంచర్ వేయించి, లైట్లు అమర్చి, ఎండలో ట్రాలీ ఆటో ద్వారా రాత్రి 9 గంటల వరకు కరకగూడెం మండలం తాటిగూడెం చేరుకున్నాడు.
26 సంవత్సరాల తర్వాత తన మిత్రుడిని కలుసుకున్న కృష్ణ భావోద్వేగానికి లోనై, ట్రైసైకిల్ను శ్రీనుకు అందజేసి అతని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. అనంతరం తిరుగు ప్రయాణంగా సుమారు 160 కిలోమీటర్లు ప్రయాణించి మణుగూరు మీదుగా సత్తుపల్లి చేరుకున్నాడు.
ఈ సంఘటన స్నేహబంధం ఎంత గొప్పదో, మానవత్వం ఎలా పరిమళించాలో చూపించింది. జిమ్మిడి శ్రీను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృష్ణతో పాటు సహకరించిన బాల్యమిత్రులను అభినందించారు.








