కరకగూడెంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా కరకగూడెం మండల కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మరియు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమం సర్పంచ్ పోలబోయిన సుజాత, ఎంపీడీవో డి.వి.వి. కుమార్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు, ఆయన దేశానికి అందించిన రాజ్యాంగం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. “జై భీమ్” నినాదాలతో మండల కేంద్రం మారుమోగింది.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని, ముఖ్యంగా యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్సై పీవీఎన్ రావు, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ఉప సర్పంచ్ బుడగం రాము, మండల నాయకులు ఎర్ర సురేష్, మాజీ సర్పంచ్ తోలెం నాగేశ్వరరావు, షేక్ రఫీ, ముంజాల సాయిబాబా, కరకపల్లి నాగేష్, పోలీస్ సిబ్బంది, వార్డ్ సభ్యులు, స్థానిక నాయకులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








