మొగలితోగు విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్, షూస్ పంపిణీ
డాక్టర్ సారంగపాణి సేవలు ఆదర్శనీయం: ఎంఈఓ గడ్డం మంజుల
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం మొగలితోగు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూస్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కరకగూడెం మండల ఎంఈఓ గడ్డం మంజుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ సారంగపాణి విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్, షూస్ అందజేశారు.
ముఖ్య అతిథి గడ్డం మంజుల మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాలైన కరకగూడెం మండలాన్ని ఎంపిక చేసుకుని విద్యార్థుల్లో ఆత్మన్యూనత భావాన్ని తొలగించి, ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా ఇలాంటి సేవలు అందించడం అభినందనీయం అన్నారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి డాక్టర్ లింగంపల్లి దయానంద్ మాట్లాడుతూ, డాక్టర్ సారంగపాణి జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారని, సమాజ భవిష్యత్తు అయిన విద్యార్థులను సక్రమంగా తీర్చిదిద్దితే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను వినియోగించుకుని ముందుకు సాగాలని సూచించారు.
పద్మాపురం గ్రామ సర్పంచ్ తోలం రమేష్ మాట్లాడుతూ, పాఠశాల విద్యార్థుల కోసం డాక్టర్ సారంగపాణి చేస్తున్న సేవలు అభినందనీయమని, పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పటాని యాకూబ్ ఖాన్, టీచర్లు టి. సుజాత, వసంత, రామస్వామి, రవీందర్, అంగన్వాడీ టీచర్తో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.









