క్రీడల్లో అగ్రగామిగా నిలిచిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల స్పోర్ట్స్ మీట్లో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన రెండవ రోజు క్రీడా పోటీల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అద్భుత ప్రతిభ కనబరిచి అందరి ప్రశంసలు అందుకున్నారు. రాజకీయ రంగంలోనే కాకుండా క్రీడా రంగంలోనూ తన సత్తా చాటుతూ బహుముఖ ప్రతిభను ప్రదర్శించారు.
పలు క్రీడల్లో పాల్గొన్న మల్లన్న ఫుట్బాల్, వాలీబాల్, 100 మీటర్ల పరుగుపందెం, షాట్పుట్, జావెలిన్ త్రో విభాగాల్లో మొదటి స్థానాలు సాధించి స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. కబడ్డీ, ఆర్చరీ, క్రికెట్ విభాగాల్లో రెండో స్థానాలు, బ్యాడ్మింటన్ మరియు 100 మీటర్ల నడక పోటీల్లో మూడో స్థానాలు సాధించారు.
మొత్తం ప్రదర్శన ఆధారంగా మల్లన్నను నిర్వాహకులు “బెస్ట్ ప్లేయర్ అవార్డు”తో సత్కరించడం విశేషం. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో ఆయన చూపిన నైపుణ్యం, క్రమశిక్షణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్లోనూ మెప్పించిన మల్లన్న, ఫుట్బాల్, వాలీబాల్లో చురుకైన ఆటతీరు ప్రదర్శించారు. కబడ్డీ, బ్యాడ్మింటన్, ఆర్చరీ వంటి విభిన్న క్రీడల్లోనూ సమాన ప్రతిభ కనబరిచారు.
ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు క్రీడలను ప్రోత్సహిస్తూ ఆరోగ్యకర జీవన విధానానికి మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు.
మొత్తానికి, ఈ స్పోర్ట్స్ మీట్లో తీన్మార్ మల్లన్న ప్రదర్శన ఆయనను ప్రజా నాయకుడిగానే కాకుండా ప్రతిభావంతమైన క్రీడాకారుడిగా కూడా నిలబెట్టింది.









