విద్యార్థినిగా మారిన మహిళా ఎస్సై అమూల్య.. ఆకతాయిలకు గట్టి హెచ్చరిక
జయ శంకర భూపాల పల్లి,ఆధాబ్ న్యూస్ ప్రతినిధి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక ప్రత్యేక ఘటన చోటుచేసుకుంది. టేకుమట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న మహిళా ఎస్సై అమూల్య, విద్యార్థినిగా మారి ఆకతాయిలకు బుద్ధి చెప్పిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని అరికట్టేందుకు ఎస్సై అమూల్య వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఖాకీ యూనిఫాం కాకుండా, సాధారణ విద్యార్థినిలా ఎరుపు రంగు దుస్తులు ధరించి, చేతిలో పుస్తకాలు పట్టుకుని పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు.
ఆమెను సాధారణ విద్యార్థినిగా భావించిన కొంతమంది ఆకతాయిలను అక్కడికక్కడే గుర్తించి, వారిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ చర్యతో పరీక్షా కేంద్రాల వద్ద వేధింపులకు చెక్ పడింది.
పోలీసులు ఎప్పుడైనా, ఏ రూపంలోనైనా ప్రజల భద్రత కోసం సిద్ధంగా ఉంటారని ఈ సంఘటన ద్వారా స్పష్టమైంది. ఎస్సై అమూల్య ధైర్యం, సమయస్ఫూర్తిపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ ఘటన ఆకతాయిలకు గట్టి హెచ్చరికగా నిలిచిందని, మహిళా భద్రత కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుందని నేటిజన్లు అభిప్రాయపడుతున్నారు.









