తునికలు, కొలతలపై అవగాహన కార్యక్రమం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
వినియోగదారుల హక్కుల పరిరక్షణలో భాగంగా కరకగూడెం మండలంలో తునికలు, కొలతలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ అధికారి సుభాష్తో పాటు కన్స్యూమర్ రైట్స్ జిల్లా చైర్మన్ సారిక లింగయ్య, డిప్యూటీ చైర్మన్ సిహెచ్ దామోదర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యాపారులు ఉపయోగించే తూకాలు, కొలత పరికరాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. తూకాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో సమయానుకూలంగా తనిఖీలు జరిపించుకోవాలని వ్యాపారులకు సూచించారు.
వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి వస్తువులో సరైన బరువు, కొలతలు పొందడం వారి ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. ఎక్కడైనా తప్పుడు తూనికలు, తక్కువ కొలతలు లేదా మోసపూరిత చర్యలు గమనించినట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం ఇలాంటి తప్పిదాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం పెంపొందించడంతో పాటు వ్యాపారులు పారదర్శకంగా వ్యవహరించేలా చేయడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. వినియోగదారుల హక్కులు కాపాడబడినప్పుడే సమాజంలో న్యాయం, నమ్మకం పెరుగుతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజలు, వ్యాపారులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలను తరచుగా నిర్వహించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.









