గోదావరిలో విషాదం… స్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు ప్రవాహానికి బలి
భద్రాచలం,మార్చి 20 ఆధాబ్ న్యూస్ :గోదావరి నదిలో స్నానానికి దిగిన ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు నీటి ఉధృతికి కొట్టుకుపోయిన విషాద ఘటన భద్రాచలం సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
వివరాల్లోకి వెళ్తే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో ఉన్న SRM ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు సెలవుల సందర్భంగా భద్రాచలం పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో భద్రాచలం – కూనవరం రహదారిలోని కొల్లుగూడెం ఇసుక ర్యాంపు ప్రాంతానికి వెళ్లి గోదావరి నది అందాలను వీక్షించారు.
అనంతరం వారిలో ఐదుగురు విద్యార్థులు నదిలో స్నానం చేయడానికి దిగగా, నది లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడం, నీటి మట్టం అధికంగా ఉండటం, ప్రవాహ వేగం ఒక్కసారిగా పెరగడంతో వారు నీటిలో మునిగిపోయారు. గట్టుపై ఉన్న మిగిలిన ఇద్దరు విద్యార్థులు ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర కలకలం రేపగా, విద్యార్థుల కుటుంబాల్లో దుఃఖ ఛాయలు నెలకొన్నాయి.









