రంజాన్ సందర్భంగా “ఈద్ కా తోఫా” కిట్ల పంపిణీ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులకు “ఈద్ కా తోఫా” కిట్లను పంపిణీ చేశారు. తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 75 కిట్లను ముస్లిం పెద్దలకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి (MRO) వట్టం కాంతయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, రంజాన్ మాసం కేవలం ఉపవాసాల కాలం మాత్రమే కాకుండా శాంతి, సేవ, సహనం, మానవత్వాన్ని పెంపొందించే పవిత్ర సమయమని పేర్కొన్నారు. ఈ నెలలో ఆకలి విలువను తెలుసుకుని, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలనే భావన పెరుగుతుందని అన్నారు.
ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముస్లిం సోదర సోదరీమణుల పండుగలను గౌరవిస్తూ, వారి ఆనందంలో భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈద్ కా తోఫా కిట్లను అందజేయడం ద్వారా ప్రతి కుటుంబంలో ఆనందం నిండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ముస్లిం పెద్దలు సజ్జాద్ హుస్సేన్, పఠాన్ యాకూబ్, పఠాన్ అక్బర్, అబ్దుల్లా, సలీం, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.









