గ్యాస్ కొరతపై అపోహలు నమ్మవద్దు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలకు ఆదేశాలు
హైదరాబాద్, మార్చి 13: ఆధాబ్ న్యూస్:
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడిందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
శుక్రవారం ఉదయం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం నుండి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా పరిస్థితిపై సమీక్షించారు.
మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని, బాట్లింగ్ ప్లాంట్లలో ఎక్కడా కొరత లేదని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాల వల్లే ప్రజల్లో గందరగోళం నెలకొంటోందని పేర్కొన్నారు. అపోహలకు లోనై అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 810 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుండగా, మొత్తం కోటి 29 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. రోజువారీగా సుమారు 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతోందని వివరించారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.
అపోహలను అడ్డుపెట్టుకుని గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, మళ్లించడం లేదా బ్లాక్ మార్కెట్కు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి హెచ్చరించారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి అక్రమాలపై 288 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు కొనసాగించాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు ఆదేశించారు.
గ్యాస్ సరఫరా పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హై లెవల్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు, సరఫరాపై సమీక్ష నిర్వహించాలని సూచించారు.
పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకొకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకొకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ ఐడీఓసీ కార్యాలయం నుండి పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. గ్యాస్ కొరతపై ప్రజలు అపోహలు నమ్మవద్దని, అక్రమ నిల్వలు లేదా బ్లాక్ మార్కెట్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, మేనేజర్ త్రినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు.









