గంజాయి నిర్మూలన లక్ష్యంగా అవగాహన ర్యాలీ
– ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు

కరకగూడెం,ఆధాబ్,న్యూస్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా కరకగూడెంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యువత భవిష్యత్తును నాశనం చేసే గంజాయి వంటి మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని అన్నారు.
సమాజంలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా గంజాయి విక్రయాలు లేదా వినియోగం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1908 లేదా డయల్ 100 / 112 కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ పీవీఎన్ రావు, ఎంఈవో గడ్డం మంజూల, ఈగల్ ఫోర్స్ సభ్యుడు కటిక రవిప్రసాద్, ఉప సర్పంచ్ బుడగం రాము, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









