గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం – 130 మందికి పరీక్షలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని చిర్రమల్ల గిరిజన ఆశ్రమ పాఠశాలలో బుధవారం వంద రోజుల మిషన్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 130 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు మరియు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు.
శిబిరంలో భాగంగా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రాణాలను కాపాడే సీపీఆర్ (CPR) విధానం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే ఎండాకాలం నేపథ్యంలో వడదెబ్బ (హీట్ స్ట్రోక్) తగిలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి కూడా వివరించారు.
మణుగూరు ఏరియా ఆసుపత్రి ఆప్తాల్మిక్ ఆఫీసర్ జి. సంజీవరావు విద్యార్థులకు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, సైట్ సమస్యలు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన పోషకాహారం, కంటి వ్యాయామాల గురించి వివరించారు. ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తరుణ్ సీపీఆర్ విధానం, వడదెబ్బ లక్షణాలు మరియు జాగ్రత్తలపై విద్యార్థులకు సూచనలు ఇచ్చారు.
ఈ వైద్య శిబిరాన్ని ఆశ్రమ పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్ ఈ. బాలరాజు సమన్వయం చేశారు. కార్యక్రమాన్ని కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్. రావు సందర్శించి వైద్య సిబ్బందిని అభినందించారు.
శిబిరంలో ఆర్బిఎస్కే ఫార్మసిస్ట్ సరస్వతి, ఏఎన్ఎంలు పుష్ప, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం నిర్వహించిన ఈ వైద్య శిబిరం వారికి ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.









