అశ్వాపురంపాడులో హత్య కేసు ఛేదన… ఐదుగురు నిందితులు అరెస్ట్
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28 అర్ధరాత్రి జరిగిన హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ కేసులో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా, వారిని రిమాండ్కు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం… అశ్వాపురంపాడు గ్రామానికి చెందిన కొవ్వాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని పథకం ప్రకారం గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. గ్రామంలో కొంతకాలంగా వ్యక్తిగత గొడవలు మరియు విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో అరెస్టు అయిన నిందితులు:
1. వజ్జ భీమరాజు (38), అశ్వాపురంపాడు – వ్యవసాయం
2. మడివి మంగయ్య (39), అశ్వాపురంపాడు – వ్యవసాయం
3. మడివి నందయ్య (37), అశ్వాపురంపాడు – వ్యవసాయం
4. వంకా బాలాజీ (36), ట్రాక్టర్ డ్రైవర్ – సారపాక (బూర్గంపాడు మండలం)
5. మడకం లక్ష్మయ్య (40), సుతారి మేస్త్రీ – తాళ్లగొమ్మూరు (బూర్గంపహాడ్ మండలం)
పోలీసుల దర్యాప్తులో తెలిసిన వివరాల ప్రకారం, మొదటి ముగ్గురు నిందితులకు మృతుడితో గత కొంతకాలంగా గ్రామంలో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు తమ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడని భావించి అతన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో జైలులో పరిచయమైన బాలాజీ సహాయంతో రూ.50 వేల రూపాయలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకుని, బాలాజీ తన స్నేహితుడు లక్ష్మయ్యతో కలిసి ఫిబ్రవరి 27న అశ్వాపురంపాడు గ్రామానికి వచ్చారు. అనంతరం పథకం ప్రకారం ఫిబ్రవరి 28 అర్ధరాత్రి సమయంలో నిద్రలో ఉన్న వెంకటేశ్వర్లుపై గొడ్డలితో దాడి చేసి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, ఏడూళ్ల బయ్యారం సీఐ వి. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, రక్తపు మరకలతో ఉన్న బట్టలు మరియు ఘటనకు ఉపయోగించిన మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితులను కోర్టులో హాజరు పరచగా, కోర్టు వారిని రిమాండ్కు పంపింది.
ఈ ఆపరేషన్లో స్థానిక ఎస్ఐ పి.వి.ఎన్. రావు, ఎస్ఐ పి. సురేష్ (ఏడూళ్ల బయ్యారం) మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.









