ఆర్డీవో కార్యాలయంలో ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోడౌన్ను గురువారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎంల భద్రతను ప్రతి మూడు నెలలకు ఒకసారి పరిశీలించే ప్రక్రియలో భాగంగా ఈ తనిఖీ నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు ఉన్న గదులను పరిశీలించారు. అలాగే సీసీ కెమెరా గదిని సందర్శించి కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. గోడౌన్ పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించవద్దని సంబంధిత అధికారులకు, భద్రతా సిబ్బందికి సూచించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు.
ఈ తనిఖీలో కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, డీఎల్ఎంటీ సాయికృష్ణతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు నోముల రమేష్ (బీజేపీ), జయశ్రీలక్ష్మి (కాంగ్రెస్), రాంబాబు (హమ్ ఆప్ ది పార్టీ), ఎల్ బాలరాజు (సీపీఎం), ఏ సత్యనారాయణ, ఎన్నికల సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.









