కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు – లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ అరెస్ట్
మేడ్చల్,ఆధాబ్ న్యూస్:
మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం (ఫ్యామిలీ సర్టిఫికెట్) జారీ చేయడానికి లంచం డిమాండ్ చేసిన జూనియర్ అసిస్టెంట్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అధికారుల వివరాల ప్రకారం, ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ చేయడానికి సంబంధిత వ్యక్తి వద్ద నుంచి రూ.30,000 లంచం డిమాండ్ చేసిన జూనియర్ అసిస్టెంట్ గణేష్, తొలి విడతగా రూ.15,000 స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అతడిని పట్టుకున్నారు.
బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పథకం ప్రకారం ట్రాప్ నిర్వహించినట్లు తెలిసింది. లంచం తీసుకుంటున్న సమయంలోనే గణేష్ను అదుపులోకి తీసుకుని కార్యాలయంలో పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
అభియోగిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.









