ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
హోళీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ వేడుకలను సాంప్రదాయబద్ధంగా, పరస్పర గౌరవంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలను కోరారు.

హోళీ వేడుకల సందర్భంగా సహజసిద్ధమైన రంగులను మాత్రమే ఉపయోగించాలని, హానికరమైన రసాయనిక రంగులను వాడరాదని సూచించారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలు చేయరాదని హెచ్చరించారు. ప్రార్థనా మందిరాలు, ప్రజా ప్రదేశాలు, రహదారులపై వాహనదారులకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించవద్దని సూచించారు.

ఎవరైనా ఆకతాయిలు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రధాన కూడళ్లలో మరియు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా బృందాలను మోహరించనున్నట్లు చెప్పారు.

పండుగ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత అతివేగంగా వాహనాలు నడపకుండా అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈత రాని వారు చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్లకూడదని, చిన్నపిల్లలను అటువంటి ప్రదేశాలకు తీసుకెళ్లరాదని విజ్ఞప్తి చేశారు. లోతైన నీటిలో ప్రమాదాలకు గురికాకుండా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

జిల్లా ప్రజలందరూ పరస్పర గౌరవంతో, సురక్షితంగా హోళీ పండుగను జరుపుకొని పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!