బీటీ రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలి: సామాజిక కార్యకర్త, లాయర్ కర్నే రవి
మణుగూరు, ఆధాబ్ న్యూస్: ప్రజా సమస్యల పరిష్కారంలో సుదీర్ఘంగా ముందుండే సామాజిక కార్యకర్త, లాయర్ కర్నే రవి బీటీ రోడ్ల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వాధికారులను కోరారు. జీవో నెంబర్ 68 కింద మంజూరైన రోడ్ల పనులను ప్రారంభించేలా మణుగూరు ఫారెస్ట్ డివిజన్ అధికారికి ఆయన వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం గిరి సంక్షేమ డిపార్ట్మెంట్ ద్వారా బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేసినప్పటికీ, ఫారెస్ట్ అధికారుల ఇబ్బందుల వల్ల పనులు ప్రారంభం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే —
పివి కాలనీ నుండి రేగులగండి వరకు రూ.1.35 కోట్లు
ఎస్సిసిఎల్ రోడ్డు నుండి వాగు మల్లారం వరకు రూ.1.27 కోట్లు
పగిడేరు నుండి సమ్మక్క సారలమ్మ గుడి వరకు రూ.1.27 కోట్లు
యుపిఎస్ కూనవరం నుండి ఏనికసర్వాయిగుంపు వరకు రూ.1.87 కోట్లు
రైల్వే స్టేషన్ మణుగూరు నుండి రాయన్నపేట వరకు రూ.75 లక్షలు
ఈ మొత్తం ప్రాజెక్టులకు ఏడాది క్రితమే నిధులు మంజూరయ్యాయని, కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కలెక్టర్ త్వరితగతిన స్పందించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.
ఫారెస్ట్ డివిజన్ అధికారి కూడా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపినట్టు పేర్కొన్నారు. చివరగా కర్నే రవి మాట్లాడుతూ, ఈ రోడ్లను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల రాకపోకలకు మరియు అభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.









