పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లుతో మణుగూరులో మేడే జెండా ఆవిష్కరణ
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
మణుగూరు మండల కేంద్రంలో మే డే సందర్భంగా బొగ్గు ముఠా లోడింగ్ అన్లోడింగ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ భవనంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మే డే చారిత్రాత్మక దినం అని, చికాగోలో కార్మికుల పోరాటం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని హక్కు సాధ్యమైందన్నారు. పరిశ్రమలలో పనిచేసే ప్రజలు “మేమూ మనుషులమే, మా శక్తికి పరిమితులుంటాయి” అని స్పష్టం చేస్తూ, పని విరమణ చేసి తుదకు ప్రాణత్యాగం చేసిన చరిత్రను గుర్తు చేశారు.
తర్వాత బొగ్గు ముఠాలోని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అనంతరం 14 టైర్లు లారీ యూనియన్ కార్యాలయంలో కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినకి నవీన్, పట్టణ అధ్యక్షుడు శివ సైదులు, బొగ్గు ముఠా అధ్యక్షుడు రాంబాబు, 14 టైర్లు యూనియన్ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు, కార్మికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









