కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడిపై పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ.
బూర్గంపాడు, ఆధాబ్ న్యూస్:
జమ్ముకాశ్మీర్ పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ బూర్గంపాడు మండల కేంద్రంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబడింది. బూర్గంపాడు రైతు వేదిక నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ, దేశ శాంతి భద్రతలను భంగం పరిచే ప్రయత్నంగా ఈ దాడిని పేర్కొన్నారు. మత, రాజకీయాలకు అతీతంగా ప్రతి భారతీయుడు ఐక్యంగా ఉగ్రవాదానికి ఎదురు పోరాడాలని పిలుపునిచ్చారు.
దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ, బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముష్కరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గంపూడి కృష్ణారెడ్డి, మహిళా నాయకులు, యువజన నేతలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.









