మేడే కానుకగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు శుభవార్త చెప్పాలి: ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా
మణుగూరు ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మేడేను పురస్కరించుకుని సింగరేణి కాలరీస్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతన పెంపు సహా పలు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మంగళవారం మణుగూరు ఏరియా జిఎం కార్యాలయం వద్ద ఐఎఫ్టియు (సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కార్మికులు ఏరియా ఇన్చార్జ్ ఎస్ఓ టు జిఎం దొంత వెంకట రామారావు గారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.డి. నాసర్ పాషా మాట్లాడుతూ, “సింగరేణిలో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 22ను గెజిట్ చేసి అమలు చేయాలని, లేదా హై పవర్ కమిటీ వేతనాలు అమలుపరచాలని” డిమాండ్ చేశారు. అదే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం “సమాన పనికి సమాన వేతనం” ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
వినతిపత్రంలో ప్రస్తావించిన ముఖ్య డిమాండ్లు:
బెల్ట్ క్లీనింగ్, మక్ క్లీనింగ్ కార్మికులను సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలి
సివిల్ మేస్త్రీల్ని స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించి తగిన వేతనాలు చెల్లించాలి
ప్రతి నెల 7వ తేదీలోగా వేతనాలు చెల్లించాలి
కార్మిక కుటుంబాలకు ఈఎస్ఐ వైద్య సదుపాయాలు కల్పించాలి
సంక్షేమ పథకాలు అమలుపరచాలి
మార్చి 31, 2025 వరకు పీఎఫ్ లెక్కలు చూపించాలి
పెండింగ్లో ఉన్న పెన్షన్ అమలు చేయాలి
రక్షణ పరికరాలు, యూనిఫామ్లు అందించాలి
ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు కామన్ ఖాకీ యూనిఫామ్ ఇవ్వాలి
సోలార్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులను గుర్తించి వేతనాలు పెంచాలి
ఓబీ వర్కర్లకు వేతనాలు పెంచాలి
వోల్వో డ్రైవర్లను ఆపరేటర్లుగా గుర్తించాలి
ఖాళీగా ఉన్న క్వార్టర్లను కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించాలి
జాతీయ సెలవులు ప్రకటించాలి
తొలగించిన ప్రైవేట్ వైద్య సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలి
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ఏరియా అధ్యక్షుడు అంగోత్ మంగీలాల్, కాంట్రాక్ట్ కార్మికులు కే. గురుమూర్తి, జి. నాగేశ్వరరావు, వై. సంజీవరావు, పి. వెంకటేశ్వర్లు, జి. శ్రీను, బి. చంద్రం, జి. శ్రీనివాస్, టి. రాముడు, నాగమణి, ఎల్లమ్మ, సుందరం, రమాదేవి, రాజేష్, దేవేందర్ రావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
మండుటెండలోనూ కార్మికులు భారీ సంఖ్యలో హాజరై సంఘీభావం తెలియజేశారు.









