మేడే కానుకగా కాంట్రాక్టు కార్మికుల జీతాల పెంపు ప్రకటించాలి: జేఏసీ డిమాండ్
మణుగూరు,ఆధాబ్ న్యూస్ :
మేడే రోజున కాంట్రాక్టు కార్మికుల జీతాలలో పెంపు ప్రకటించాలని కోరుతూ సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం (ఏప్రిల్ 30) ఉదయం 9 గంటలకు కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట దీక్ష, సాయంత్రం 4 గంటలకు మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు మణుగూరులోని కెసిఎస్పి రోడ్ క్లీనింగ్ మాస్టర్ అడ్డా వద్ద కాంట్రాక్టు కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఇందులో జేఏసీ నేతలు గద్దల శ్రీనివాస్, ఆర్. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, “మేడే – కార్మికుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు ప్రకటించాలి. వారూ మనుషులే, వారి శ్రమకు గౌరవం దక్కాలి,” అని అన్నారు.
కాంట్రాక్ట్ కార్మికులపై సింగరేణి యాజమాన్యం శ్రమ దోపిడీ కొనసాగిస్తున్నదని ఆరోపించారు. కోల్ ఇండియా ఒప్పందాలను పాటించకపోవడమే కాక, గతంలో లేబర్ కమిషనర్ సమక్షంలో చేసిన అగ్రిమెంటు కూడా అమలు చేయడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించాలని JAC నిర్ణయించిందని వెల్లడించారు.
“30న జరిగే మహాధర్నా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి పెంచుతాం. ఈ ఉద్యమాన్ని అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు విజయవంతం చేయాలి,” అని నాయకులు పిలుపునిచ్చారు.









