భద్రాచలం, ఆధాబ్ న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక పురోగతిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకంను ప్రకటించింది. ఈ పథకం కింద గిరిజన నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలను అందించేందుకు ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు.
అర్హత మరియు ఆసక్తి గల భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలకు చెందిన గిరిజన నిరుద్యోగులు OBMMS ఆన్లైన్ పోర్టల్ (https://tgobmmsnew.cgg.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలు, ఇతర వివరాలు https://tgobmms.cgg.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు.
దరఖాస్తు ప్రక్రియ ఈనెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కొనసాగుతుందని, మరిన్ని వివరాలకు భద్రాచలం ఐటిడిఏ కార్యాలయ ఫోన్ నంబర్లు 94928 06325, 98485 22841 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. అదనంగా, మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయాన్ని కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
రాజీవ్ యువ వికాసం పథకం ప్రయోజనాలను గిరిజన యువతకు తెలియజేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలని ప్రాజెక్టు అధికారి అన్ని ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు.









