చిరుమళ్ళ సమ్మక్క సారక్క వనదేవతల జాతరలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పాయం
కరకగూడెం ,ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమళ్ళ గ్రామంలో చందా వంశస్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారక్క వనదేవతల జాతరకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆలయ పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు సమ్మక్క సారక్క గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఎమ్మెల్యే పాయం ఆదివాసీ గిరిజనులతో కలిసి సాంప్రదాయ నృత్యం చేసి, జాతర ఉత్సాహాన్ని పెంచారు. అనంతరం మాట్లాడుతూ సమ్మక్క సారక్క జాతరకు రావడం ఎంతో సంతోషంగా ఉందని, చిరుమళ్ళ సమ్మక్క సారక్క గుడిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆలయానికి అవసరమైన రోడ్డు, ప్రహరీ గోడ నిర్మాణానికి కృషి చేస్తామని తెలియజేశారు.
జాతర ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చందా వంశస్థులకు మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సమ్మక్క సారక్క వనదేవతల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ కలగాలని కోరుకున్నారు. ఈ
కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య, చందా సంతోష్, కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ మండల నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు హాజరయ్యారు.









