స్వాతంత్ర్య వేడుకల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై కలెక్టర్కు ఫిర్యాదు
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 18 (ఆధాబ్ న్యూస్): స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేసిన వ్యవహారంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందంటూ తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ విద్యాసంస్థ అయిన నవోదయ విద్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ జాతీయ జెండా ఎగురవేయడానికి ఏ ప్రోటోకాల్ ప్రకారం అనుమతి ఇచ్చారో, ఏ అధికారిక ఉత్తర్వుల ఆధారంగా అవకాశం కల్పించారో సమగ్రంగా విచారణ చేయాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ జాతీయ జెండా దేశ గౌరవానికి ప్రతీక అని, స్వాతంత్ర్య దినోత్సవం ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో జాతీయ పర్వదిన వేడుకలు ప్రభుత్వ ప్రోటోకాల్, Flag Code of India, 2002 నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాల్సి ఉందన్నారు.
నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ పాత్రపైనా విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే తగిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టపరమైన ఉల్లంఘన నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై వర్తించే చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెంకటనారాయణ తెలిపారు.
“జాతీయ జెండా గౌరవం విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు ఉండకూడదు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారమే జరగాలి. కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు సమగ్ర విచారణ జరిగి బాధ్యులపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం” అని వెంకటనారాయణ అన్నారు.








