అధికారుల గైర్హాజరీతో గ్రామసభ బహిష్కరణ.. కరకగూడెంలో ప్రజాప్రతినిధుల నిరసన
ఆధాబ్ న్యూస్ , కరకగూడెం ఆగస్టు 6:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మేజర్ గ్రామపంచాయతీలో నిర్వహించాల్సిన గ్రామసభ సంబంధిత అధికారుల గైర్హాజరీతో వివాదాస్పదంగా మారింది. గ్రామ సమస్యలను ప్రజలతో చర్చించి పరిష్కార మార్గాలు అన్వేషించాల్సిన గ్రామసభకు అధికారులు హాజరు కాకపోవడాన్ని నిరసిస్తూ ప్రజాప్రతినిధులు గ్రామసభను బహిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, అధికారుల సమక్షం లేకుండానే గ్రామసభను తూతూ మంత్రంగా నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల సమస్యలపై బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని విమర్శించారు.
గ్రామసభల ఉద్దేశం ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కార చర్యలు చేపట్టడమేనని, సంబంధిత శాఖల అధికారులు హాజరుకాకపోవడం వల్ల ప్రజలకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు.
ఇకపై గ్రామసభలను అన్ని శాఖల అధికారుల సమక్షంలో, ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా నిర్వహించాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్య వైఖరిని వీడి గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.









