ప్రజా చైతన్య యాత్రకు పినపాకలో శ్రీకారం.. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ విమర్శలు
ఆధాబ్ న్యూస్ , పినపాక:
సీపీఐ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని బయ్యారంలో గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం హమాలీ సంఘం కార్యాలయం, క్రాస్రోడ్లోని సీపీఐ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. క్రాస్రోడ్లో ఉన్న కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తర్వాత క్రాస్రోడ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతులు, కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ వాటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
రైతు పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ కల్పించాలని, పెట్రోల్, డీజిల్, ఎరువులు, పురుగుమందులు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ను తక్షణమే అమలు చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న పోడు భూముల పట్టాలను వెంటనే మంజూరు చేయాలని కోరారు.
సీతారామ ప్రాజెక్టు ద్వారా కొత్తగూడెం జిల్లా రైతులకు సాగునీరు అందించాలని, బీటీపీఎస్, సీతారామ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులకు తగిన నష్టపరిహారం, కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు తమ సమస్యలను వివరిస్తూ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు వినతిపత్రం అందజేశారు. పినపాక, కరకగూడెం మండలాల్లో ఇటీవల పోడు భూముల వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో పోడు రైతుల పక్షాన సీపీఐ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. బందాగిరినగరం పోడు భూముల నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ భాషా, మండల కార్యదర్శి తోగటి కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు గడ్డం మనోహరాచారి, పత్తిపాటి నాగేశ్వరరావు, కారం రమేష్, మండల సహాయ కార్యదర్శులు కప్ప వెంకటేశ్వర్లు, హమాలీ సంఘం నాయకుడు కాసు జంపయ్య, సీపీఐ సీనియర్ నాయకుడు కమిశెట్టి రామారావు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









