రేగా కాంతారావుపై నమోదైన కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం
రాజకీయ కక్షతో తప్పుడు కేసులు పెడితే సహించేది లేదు
మహిళలను అడ్డుపెట్టుకుని అసత్య ప్రచారం మానుకోవాలి
మా నాయకుడిపై నిరాధార ఆరోపణలు చేస్తే గట్టిగా సమాధానం ఇస్తాం
కాంగ్రెస్ నాయకులు హద్దులు దాటి మాట్లాడితే తాటతీస్తాం
ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య హెచ్చరిక
కరకగూడెం, ఆగస్టు 3 (ఆధాబ్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై నమోదైన వేధింపుల కేసును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య తెలిపారు. సోమవారం కరకగూడెంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ నాయకుడిని రాజకీయంగా దెబ్బతీసేందుకు అధికార పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
రేగా కాంతారావుపై నమోదైన కేసును కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ బీఆర్ఎస్ పార్టీని, తమ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అమాయక ఆదివాసీ మహిళా సర్పంచులను అడ్డుపెట్టుకుని ప్రజల్లో అపోహలు సృష్టించడం, రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. ప్రజలకు కాంగ్రెస్ నాయకుల అసలు స్వరూపం బాగా తెలుసని, అవినీతి, అక్రమాలు, సెటిల్మెంట్లు, ఇసుక దందాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై ప్రజలు ఇప్పటికే అవగాహనతో ఉన్నారని పేర్కొన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన నాయకులు వాటిని పక్కనబెట్టి ప్రతిపక్ష నాయకులపై బురదజల్లే కార్యక్రమాలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. 15 రోజుల క్రితం మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ నాయకుల వ్యవహారాలు, అవినీతి ఆరోపణలపై తాము బహిరంగంగా ప్రశ్నించిన విషయాన్ని ఇప్పుడు మర్చిపోయారా? అని రావుల సోమయ్య ప్రశ్నించారు. ఆ రోజు లేవనెత్తిన ఒక్క ప్రశ్నకైనా ఇప్పటివరకు సమాధానం చెప్పకుండా, ఇప్పుడు తమ నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేయడం, తప్పుడు ఆరోపణలు చేయడం వారి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని అన్నారు.
రాజకీయాల్లోకి రాకముందు ఎవరి పరిస్థితి ఎలా ఉండేదో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారో ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. తమ నాయకుడిపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. అత్యుత్సాహంతో హద్దులు దాటి మాట్లాడితే రాజకీయంగానూ, చట్టపరంగానూ తగిన సమయంలో తగిన విధంగా సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
మహిళలను రాజకీయాలకు అడ్డుగా ఉపయోగించడం అత్యంత దురదృష్టకరమని, వారి పేర్లతో అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. వ్యక్తిగత దూషణలు, నిరాధార ఆరోపణలు మానుకుని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు. ప్రజా తీర్పును గౌరవించకుండా రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
రేగా కాంతారావుపై నమోదైన కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. నిజానిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని, అప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు సంయమనం పాటించాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి బెదిరింపులకు భయపడరని, పార్టీ నాయకత్వానికి అండగా నిలుస్తూ ప్రజల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పోగు వెంకటేశ్వర్లు, బైరిశెట్టి చిరంజీవి, సర్పంచులు కొమరం సత్యనారాయణ, వట్ట సందీప్, రేగా సత్యనారాయణ, అత్తె సత్యనారాయణ, నిట్టా ఏడుకొండలు, యల్లు రామకృష్ణారెడ్డి, కటకం లెనిన్, జాడి నాగరాజు, కొమరం విశ్వనాథం, పాయం కృష్ణ, పాయం నర్సింహారావు, గాందర్ల సతీష్, ప్రశాంత్, రాంబాబు, శ్రీను, యాకూబ్ పాషా, వేణు తదితరులు పాల్గొన్నారు.









