ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి
ఆగస్టు 3న కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహణ – జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 2 (ఆధాబ్ న్యూస్):
ఆగస్టు 3వ తేదీ సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతులు, ఫిర్యాదులను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు.
సంబంధిత శాఖల అధికారులు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, వాటిపై సత్వర చర్యలు తీసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు.









