వర్షాల అత్యవసర పరిస్థితులకు 24×7 కంట్రోల్ రూమ్
ప్రజలకు తక్షణ సేవలు.. మూడు షిఫ్టుల్లో అధికారుల విధులు
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 1 (ఆధాబ్ న్యూస్):
వర్షాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఐటీఓసీ కార్యాలయం జీ–19 గదిలో 24×7 జిల్లా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఆగస్టు 3 నుంచి వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులను మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు కంట్రోల్ రూమ్ నిరంతరాయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
ప్రజల నుంచి అందే ఫిర్యాదులు, సమాచారం, వర్షాల కారణంగా ఏర్పడే అత్యవసర పరిస్థితులను వెంటనే నమోదు చేసి సంబంధిత శాఖలకు చేరవేసి తక్షణ చర్యలు చేపట్టేలా విధుల్లో ఉన్న సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, దానిపై తీసుకున్న చర్యల వివరాలను కూడా నమోదు చేయాలని సూచించారు.
జిల్లాలో రహదారులు దెబ్బతినడం, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం, వాగులు, వంకలు పొంగిపొర్లడం వంటి పరిస్థితులు తలెత్తిన వెంటనే సంబంధిత శాఖలు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ విధుల్లో నిర్లక్ష్యం వహించినా లేదా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
వర్షాల కారణంగా అత్యవసర పరిస్థితులు లేదా ఇతర సమస్యలు ఎదురైతే ప్రజలు జిల్లా కంట్రోల్ రూమ్ 08744-241950 నంబర్కు సమాచారం అందించాలని కలెక్టర్ అంకిత్ కోరారు. ప్రజల నుంచి అందే ప్రతి సమాచారంపై వెంటనే స్పందించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం అన్ని వేళలా సిద్ధంగా ఉంటుందని తెలిపారు.









