రెమెడియల్ టీచింగ్తో వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దాలి: జిల్లా విద్యాశాఖ అధికారి డి. వాసంతి
ఆధాబ్ న్యూస్,కరకగూడెం జూలై 23:
విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థులకు రెమెడియల్ టీచింగ్ ద్వారా ప్రత్యేక బోధన అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి డి. వాసంతి సూచించారు.
ఎఫ్ఎల్ఎన్ (Foundational Literacy and Numeracy) కార్యక్రమంలో భాగంగా కరకగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న తొలి విడత శిక్షణా కేంద్రాన్ని గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ నిర్వహణ, బోధనా విధానాలు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం, శిక్షణలో చేపడుతున్న కార్యకలాపాలను పరిశీలించారు.
అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి విద్యార్థిలో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానాన్ని పెంపొందించేలా బోధన చేపట్టాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి రెమెడియల్ టీచింగ్ ద్వారా వారి అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
తరగతి గదిలో కార్యాచరణ ఆధారిత బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి విద్యార్థి కనీసం 80 శాతం అభ్యాస ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల నేర్చుకునే స్థాయిని నిరంతరం అంచనా వేస్తూ, అవసరమైన చోట తగిన విద్యా సహాయాన్ని అందించాలని పేర్కొన్నారు.
శిక్షణలో చురుకుగా పాల్గొంటున్న ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారి అభినందించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి జి. మంజుల, మండల రిసోర్స్ పర్సన్లు కె. సూర్యనారాయణ, బి. భావ్ సింగ్, ఎం. తిరుమలరావు, సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.









