మూడేళ్లుగా అందని బిల్లులు.. మూలనపడ్డ పాఠశాల బాత్రూంలు
మూత్రశాలలున్నా మారని విద్యార్థుల తలరాత.. బయటకు వెళ్లాలంటే పాముల భయం
పినపాక, జూలై 22 (ఆధాబ్ న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పెంటన్నగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్)లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన బాలురు, బాలికల ప్రత్యేక మూత్రశాలలు మూడేళ్లుగా వాడుకలోకి రాకపోవడంతో చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
గతంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా చొరవతో ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ కమిటీ ఆధ్వర్యంలో, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద రూ.3.50 లక్షల వ్యయంతో పాఠశాలలో బాలురు, బాలికల కోసం ప్రత్యేక మూత్రశాలలు నిర్మించారు. నిర్మాణ పనులను కాంట్రాక్టర్ శంకర్ పూర్తి చేసినప్పటికీ, బిల్లులు ఇప్పటికీ విడుదల కాకపోవడంతో మూత్రశాలలకు తాళాలు వేసి ఉంచినట్లు సమాచారం.
ఆన్లైన్ ప్రక్రియ పూర్తికాలేదనే కారణంతో అధికారులు బిల్లుల చెల్లింపును వాయిదా వేస్తుండటంతో, నిర్మాణం పూర్తయినా విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల పరిసర ప్రాంతాల్లో పొలాలు, దట్టమైన చెట్లు ఉండటంతో పాటు పాములు, విషకీటకాల సంచారం ఎక్కువగా ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. బాత్రూంలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తోందని, దీంతో వారి భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్, సంబంధిత విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేయించాలని, బాత్రూంలను వెంటనే విద్యార్థుల వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు. చిన్నారుల ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రత దృష్ట్యా సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.









