రైతుల ఫిర్యాదులతో కన్యాపరమేశ్వరి ఫర్టిలైజర్పై ఆకస్మిక తనిఖీ
అధిక ధరలకు యూరియా విక్రయం, అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ డిమాండ్
ఆధాబ్ న్యూస్, కరకగూడెం, జూలై 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారం గ్రామంలోని కన్యాపరమేశ్వరి ఫర్టిలైజర్ దుకాణంపై రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు మండల వ్యవసాయ అధికారి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ నాయకులు కూడా పాల్గొన్నారు.
రైతుల ఆరోపణల ప్రకారం, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయించాల్సిన యూరియా ఎరువులను ఒక్కో బస్తాకు రూ.350 నుంచి రూ.450 వరకు అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని తెలిపారు. అయితే బిల్లుల్లో మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించినట్లు నమోదు చేసి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
అదేవిధంగా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకున్న ఎరువులను వారికి సకాలంలో అందించకుండా, గడువు ముగిసిన తర్వాత రైతులకు సమాచారం ఇవ్వకుండా వాటిని కొనుగోలు చేసినట్లు నమోదు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని రైతులు పేర్కొన్నారు. రైతుల పేర్లను ఉపయోగించి అక్రమ లావాదేవీలు నిర్వహించడం అత్యంత తీవ్రమైన విషయమని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఫిర్యాదుల నేపథ్యంలో మండల వ్యవసాయ అధికారి దుకాణాన్ని తనిఖీ చేసి స్టాక్ను సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే అనంతరం సాధారణ తనిఖీ మాత్రమే నిర్వహించినట్లు పత్రికా ప్రకటన విడుదల చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ తెలిపారు.
ఒకవైపు స్టాక్ను సీజ్ చేసి, మరోవైపు సాధారణ తనిఖీ మాత్రమే చేశామని ప్రకటించడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించిన ఆయన, రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన అధికారులు ఎరువుల దుకాణ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు.
రైతులను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న వారి వెనుక ఎవరున్నారో సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని, అక్రమాలకు పాల్పడిన దుకాణ యాజమాన్యంపై, అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ డిమాండ్ చేసింది. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, అవసరమైతే జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది.









