ఆధారాలతో నిరూపించాలి.. లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి: సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
వెంకటనారాయణ ఆరోపణలు పూర్తిగా నిరాధారం.. ప్రజా కోర్టుకు సిద్ధం
- ఆధాబ్ న్యూస్, కరకగూడెం, జూలై 15: తనపై ఆదివాసి నాయకుడు పోలేబోయిన వెంకటనారాయణ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాటిని ఆధారాలతో నిరూపించాలని కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ సవాల్ విసిరారు. బుధవారం కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వెంకటనారాయణ తనపై చేస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించే చౌకబారు రాజకీయాలేనని విమర్శించారు. తనపై చేసిన ప్రతి ఆరోపణను దమ్ముంటే ఆధారాలతో ప్రజా కోర్టులో నిరూపించాలని, లేకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తాను భూ కబ్జాలు, అక్రమ పశువుల రవాణా, ఇసుక దందా, ప్రభుత్వ భూముల కొనుగోలు–అమ్మకాలలో అక్రమాలు, కమిషన్లు తీసుకున్నానన్న ఆరోపణల్లో ఏ ఒక్కటి కూడా నిజం కాదని స్పష్టం చేశారు. ఆరోపణలకు సంబంధించి ఎక్కడ, ఎప్పుడు, ఎవరి వద్ద జరిగినట్లు ఆధారాలు ఉంటే ప్రజల ముందు ఉంచాలని సవాల్ చేశారు.
తుడుందెబ్బ సంస్థ పేరును అనవసరంగా వివాదంలోకి లాగడం సరికాదని, తాను మాట్లాడింది వెంకటనారాయణ వ్యక్తిగత వ్యవహారాల గురించేనని పేర్కొన్నారు. తమ కుటుంబం తరతరాలుగా గౌరవప్రదమైన కుటుంబమని, తాను కౌలు రైతుగా కష్టపడి ఎదిగానని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలో ప్రజాసేవ, గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సహా అన్ని వర్గాల ప్రజలకు కులమతాలకు అతీతంగా సేవ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు నాగబండి వెంకటేశ్వర్లు, కరకగూడెం సర్పంచ్ పోలేబోయిన సుజాత, అనంతారం ఉపసర్పంచ్ పూజారి వెంకన్న, మండల నాయకులు అత్తే సారయ్య, షేక్ రఫీ, బిలపాటి సంపత్, జాడి శ్రీను, దుర్గం కన్నయ్య, జిమ్మిడి నవీన్, పోలేబోయిన పాపారావు, పోలేబోయిన వెంకట్, పులి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.









