కరకగూడెం JAC ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
ఆదివాసుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి: డా. చందా లింగయ్య దొర
జల్, జంగిల్, జమీన్ కోసం పోరాడిన కొమరం భీం స్ఫూర్తితో ముందుకు సాగాలి
జై ఆదివాసి.. జై కొమరం భీం నినాదాలతో మార్మోగిన కరకగూడెం
కరకగూడెం, ఆగస్టు 09 (ఆధాబ్ న్యూస్): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరకగూడెం మండల JAC కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బ్యాంకు వద్ద నుంచి ఆదివాసులు, JAC నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఆదివాసీ సంప్రదాయ దుస్తులు ధరించి సంప్రదాయ నృత్యాలు, డోలు వాయిద్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీగా బట్టుపల్లి (విరాపురం) ఎక్స్ రోడ్ వద్ద ఉన్న ఆదివాసీ ఉద్యమ నాయకుడు కొమరం భీం విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆదివాసీ జెండాను ఆవిష్కరించి, కొమరం భీం విగ్రహానికి గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా “ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి.. జై ఆదివాసి.. జై కొమరం భీం” అంటూ నినాదాలు చేశారు.
హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ఆదివాసీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ZP చైర్మన్ డా. చందా లింగయ్య దొర హాజరై మాట్లాడారు. జల్, జంగిల్, జమీన్ కోసం పోరాడిన కొమరం భీం స్ఫూర్తితో ఆదివాసులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. తమ హక్కులను తామే కాపాడుకోవాలని, ఆదివాసీ సమాజ అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు.
ఆదివాసీ ఐక్యతే తమ బలమని, హక్కుల పరిరక్షణకు సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, JAC నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, మాజీ ప్రజాప్రతినిధులు, యువకులు, అభిమానులు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









