ఇసుక లారీల రాకపోకలతో ప్రజల్లో భయాందోళన
రోడ్లు ధ్వంసమవుతాయి.. కల్వర్టులు దెబ్బతినే ప్రమాదం: బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గుడ్ల రంజిత్ కుమార్
కరకగూడెం, ఆగస్టు 08 (ఆధాబ్ న్యూస్):
ములుగు జిల్లా తాడ్వాయి మీదుగా కాటాపురం, రంగాపురం, కరకగూడెం, పినపాక వైపు అధిక సంఖ్యలో ఇసుక లారీలు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంటుందని బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక లారీలు అతివేగంగా, నిబంధనలకు విరుద్ధంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. భారీ వాహనాల రాకపోకల కారణంగా ప్రస్తుతం బాగున్న రహదారులు సైతం పూర్తిగా ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
అంతేకాకుండా భారీ ఇసుక లారీల కారణంగా మార్గమధ్యంలోని కల్వర్టులు, వంతెనలు దెబ్బతిని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉందని రంజిత్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రహదారులు, కల్వర్టులు దెబ్బతింటే గ్రామీణ ప్రాంత ప్రజలు నిత్యావసర సరుకుల కోసం సైతం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
ప్రస్తుతం మూడు రోజుల సెలవులు ఉండటంతో పిల్లలు, విద్యార్థులు ఆడుకోవడానికి బయటకు వస్తున్నారని, ఇసుక లారీల వేగం, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా వారికి ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. రహదారిపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు సైతం భయాందోళనల మధ్య ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకునే నాథుడే లేడన్న పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక లారీల రాకపోకలను నియంత్రించడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా అతివేగంగా, ర్యాష్ డ్రైవింగ్ చేసే లారీలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.









