మణుగూరు ఏరియా ఆసుపత్రి నూతన మెడికల్ సూపరింటెండెంట్ను కలిసిన న్యాయవాది కర్నే రవి
ఆధాబ్ న్యూస్, మణుగూరు ఆగస్టు 7:
మణుగూరు ఏరియా ఆసుపత్రికి నూతన మెడికల్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ముదిగొండ రామకృష్ణను సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నే రవి శుక్రవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి, స్వీట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కర్నే రవి మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ నీరు లేకుండా చూడటం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.
జ్వరం లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సలహా మేరకు చికిత్స పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మణుగూరు ఏరియా ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా నూతన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ సమర్థవంతంగా సేవలందించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బత్తుల శ్రీనివాస్, కర్నే బాబురావు, తాటి ఆంజనేయులు (బుగ్గ) తదితరులు పాల్గొన్నారు.









