గడువు ముగిసిన మందుల ఘటనపై కఠిన చర్యలు
ఫార్మసిస్ట్ సస్పెన్షన్.. షోకాజ్ నోటీసులు, బదిలీ.. ఇద్దరు సిబ్బంది సేవలు తాత్కాలికంగా నిలిపివేత
ఆధాబ్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 5
మణుగూరు ఏరియా ఆసుపత్రిలో గడువు ముగిసిన మందులను రోగులకు అందించిన ఘటనను జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. ఘటనపై జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ (డీసీహెచ్ఎస్) అధికారి డాక్టర్ రవిబాబు సమగ్ర విచారణ నిర్వహించగా, నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టారు.
విచారణలో నిర్లక్ష్యం వెలుగుచూడడంతో ఒక ఫార్మసిస్ట్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. నర్సింగ్ సూపరింటెండెంట్తో పాటు ఒక నర్సింగ్ ఆఫీసర్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ను చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు బదిలీ చేయగా, విచారణ పూర్తయ్యే వరకు ఇద్దరు పేషెంట్ కేర్ సిబ్బంది సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన లేదా బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. వైద్య సేవల నాణ్యతను దెబ్బతీసే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిల్వ ఉంచే మందుల నాణ్యత, గడువు తేదీలు, పంపిణీ విధానం, రికార్డుల నిర్వహణపై అన్ని ఆసుపత్రుల అధికారులు నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. రోగులకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం జిల్లా యంత్రాంగం ప్రధాన లక్ష్యమని పేర్కొన్న కలెక్టర్, ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించే ఎలాంటి నిర్లక్ష్యంపైనా రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా వైద్య పరిపాలన అన్ని ప్రభుత్వ వైద్య సంస్థల్లో సేవల నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.









